ముంబయిలో లిఫ్ట్‌లో గ్యాస్‌ బెలూన్లు పేలి మంటలు.. ఇద్దరికి గాయాలు

  • ముంబయిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఘటన
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • బెలూన్ షాపు యజమానిపై కేసు నమోదు చేసిన పోలీసులు
ముంబయిలో గ్యాస్‌తో నింపిన బెలూన్లు ఒక్కసారిగా పేలి లిఫ్ట్‌లో మంటలు చెలరేగిన ఘటన కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

ముంబయి గోరెగావ్‌ (వెస్ట్‌) ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో బెలూన్లు డెలివరీ చేసేందుకు రాజ్‌కుమార్ మహతో అనే వ్యక్తి లిఫ్ట్‌లోకి ఎక్కాడు. అదే సమయంలో వైద్య విద్యార్థిని హిమానీతో పాటు మరో యువకుడు కూడా లిఫ్ట్‌లోకి వచ్చారు. లిఫ్ట్‌ కదలకముందే బెలూన్లు ఒక్కసారిగా పేలిపోవడంతో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో భయంతో ముగ్గురూ వెంటనే లిఫ్ట్‌ నుంచి బయటకు పరుగులు తీశారు. 

ఈ ఘటనలో రాజ్‌కుమార్ మహతో, హిమానీకి గాయాలయ్యాయి. అపార్ట్‌మెంట్‌లో నిర్వహించనున్న ఓ వేడుక కోసం బెలూన్లను తీసుకొస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. బెలూన్ల దుకాణం యజమాని టీకే జైశ్వాల్ సూచనల మేరకు బెలూన్ల డెలివరీ జరుగుతుండటంతో.. ఆయనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

Rajkumar Mahato
Mumbai
Gas Balloons
Goregaon West
Fire Accident
Lift Accident
TK Jaiswal
Himani
Balloon Delivery

More Telugu News